శ్రీలంక–తెలంగాణ బౌద్ధ, సాంస్కృతిక, పర్యాటక బంధానికి మరింత ఊతం: మంత్రి జూపల్లి కృష్ణారావు

  • శ్రీలంక కళాకారులకు మంత్రి జూపల్లి సత్కారం.. సాంస్కృతిక మార్పిడికి ప్రోత్సాహం

హైదరాబాద్‌: శ్రీలంక–తెలంగాణ మధ్య బౌద్ధ, సాంస్కృతిక, పర్యాటక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, నాగపూర్ లోని దక్షిణ మధ్య సాంస్కృతిక కేంద్రం, సింగిడి సాంస్కృతిక సంస్థ సౌజన్యంతో ఇటీవల రవీంద్రభారతీలో నిర్వహించిన 4వ నృత్యంగాణ కార్యక్రమంలో శ్రీలంక సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించిన కళాకారుల బృందం బుధవారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసింది. శ్రీలంక కళాకారుల బృందాన్ని ఈ సందర్భంగా సన్మానించారు.

సాంస్కృతిక మార్పిడికి ప్రోత్సాహం
శ్రంగిక ననయక్కర నేతృత్వంలోని శ్రీలంక కళాకారుల బృందం, సింగిడి సాంస్కృతిక సంస్థ డైరెక్టర్‌ విశ్వకర్మ డి.ఆర్‌.కే. ఆధ్వర్యంలో మంత్రి జూపల్లిని కలిసింది. శ్రీలంక సంప్రదాయ నృత్యాలను తెలంగాణ వేదికపై ప్రదర్శించడంపై మంత్రి అభినందనలు తెలిపారు. బౌద్ధం, సంస్కృతి, కళలు, వారసత్వం వంటి అంశాలు శ్రీలంక–తెలంగాణ మధ్య సుదీర్ఘ అనుబంధానికి ప్రతీకలని మంత్రి పేర్కొన్నారు. ఇరు ప్రాంతాల మధ్య సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. నాగపూర్ దక్షిణ మధ్య సాంస్కృతిక కేంద్రం ‌నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను డైరెక్టర్‌ ఆస్తా కార్లేకర్.. ‌ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్రానికి సహకారం అందించాలని కోరగా.. మంత్రి సానుకూలంగా స్పందించారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలతోనూ సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని తెలిపారు.త్వరలోనే నాగపూర్‌లోని దక్షిణ మధ్య సాంస్కృతిక కేంద్రాన్ని సందర్శిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సాంస్కృతిక మార్పిడి, కళాకారుల పరస్పర భాగస్వామ్యం, బౌద్ధ వారసత్వం, పర్యాటక అవకాశాలపై మరింత సహకారం పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.