హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో దారుణ ఘటనకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి, అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. బాలికకు మెరుగైన వైద్యం అందించి, త్వరగా కోలుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు. బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి వారికి ధైర్యం చెప్పారు. బాలికకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.బాలిక ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. సంఘటన జరిగిన అనంతరం ఆ బాలిక ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఆ బాలిక ఆరోగ్యపరిస్దితిని పర్యవేక్షించడం తోపాటు కుటుంబ సభ్యుల బాగోగులను కూడా తెలుసుకుంటూ అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.