
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న గొడవలు, అవకతవకలపై స్పందించిన ఎన్నికల కమిషన్ పలువురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల గొడవలపై అందిన ఫిర్యాదుల మేరకు పలువురి అధికారులను సస్పెండ్ చేస్తూ పలువురిని బదిలీ చేస్తూ నిర్ణయం వెలువరించింది. చిత్తూరు జిల్లా, గుంటూరు జిల్లా కలెక్టర్లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ అదేవిధంగా ఇరు జిల్లాల ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశాలు జారీచేసింది. గుంటూరు జిల్లా మాచర్ల సీఐను సస్పెండ్ చేసిన ఈసీ శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలపై, తిరుపతి, రాయదుర్గం, తాడిపత్రి సీఐలపై బదిలీ వేటు వేసింది. తిరుపతి, మాచర్ల, పుంగనూరులో అవసరం అయితే కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామని ఈ అంశం పరిశీలనలో ఉందని ఈసీ పేర్కొంది.