
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత పేరును టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. నామినేషన్ల దాఖలుకు రేపు ఆఖరి తేదీ కాగా, బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో కలిసి నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కవిత కలిశారు. నామినేషన్ వేసేందుకు బయలుదేరే ముందు నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతోనూ కవిత సమావేశమయ్యారు. నామినేషన్ వేసేముందు జిల్లా నేతలతో కవిత మర్యాదపూర్వక భేటీలో పాల్గొన్నారు. అనంతరం నామినేషన్ వేసేందుకు కవిత నిజామాబాద్ బయలుదేరారు.