మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్‌

కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర పనుల కోసమే బయటకు వెళ్లాలని సూచించారు. అత్యవసర అవసరాల వస్తువుల కోసం బయటకు వెళ్లేందుకు కుటుంబానికి చెందిన ఒక్క వ్యక్తిని మాత్రమే అనుమతించనున్నట్టు చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనతా కర్ఫ్యూకు తెలంగాణ ప్రజలు అద్భుతంగా స్పందించారని తెలిపారు. ప్రపంచ మానవాళికి తెలంగాణ ఒక గొప్ప మార్గదర్శకంగా నిలిచిందన్నారు. చప్పట్లతో అద్భుతంగా సంఘీభావ సంకేతాన్ని, ఐక్యతను, విజ్ఞతను చాటిచెప్పిన తెలంగాణలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లినా మనిషికి, మనిషికి మధ్య 3 ఫీట్ల దూరం పాటించాలన్నారు. తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ మనిషికి 12 కేజీల చొప్పున బియ్యం అందజేయనున్నట్టు తెలిపారు. సరుకుల కోసం ఒక్కో తెల్లకార్డుకు రూ. 1500 ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ కార్యాలయాలకు రానవసరం లేదన్నారు. అయితే అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులు 100 శాతం విధులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. మిగిలిన విభాగాలకు చెందిన 20 శాతం ఉద్యోగులు విధులకు హాజరైతే సరిపోతుందని స్పష్టం చేశారు. పరీక్ష పేపర్ల వాల్యూయేషన్‌ కూడా వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. టీచర్లు కూడా స్కూళ్లకు రానవసరం లేదన్నారు.
కార్మికులు ఈ వారం రోజులు పాటు పనిచేయకున్నా యాజమాన్యం వేతనం ఇవ్వాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలను కూడా మూసివేస్తునట్టు చెప్పారు. గర్భిణీల జాబితాను సిద్ధం చేస్తున్నామని.. వారి డెలివరీలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవలు కొనసాగుతాయని చెప్పారు. అత్యవసరం కానీ శస్త్ర చికిత్సలు వాయిదా చేసుకోవాలని ప్రజలకు సూచించారు. మన వైద్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. మార్చి 31వరకు ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు అన్నీ బంద్‌ చేస్తున్నట్టు చెప్పారు. ఐదుగురు కంటే ఎక్కువ ఎవరూ రోడ్డు మీదకు రావొద్దన్నారు. తెలంగాణకు ఉన్న అంతరాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్నామని ప్రకటించారు. కేవలం అత్యవసర సరుకులు తెచ్చే గూడ్స్‌ వాహనాలకు మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తామని తెలిపారు.
ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సిబ్బందికి మాత్రమే బయట తిరిగే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. పెట్రోల్‌, ఎల్‌పీజీ గ్యాస్‌ సిబ్బందికి కూడా సేవలు అందించడానికి అనుమతిస్తున్నామని తెలిపారు. ఇటలీ కరోనా మహమ్మారి బారినపడి ప్రతి రోజు వందల మంది ప్రజలు చనిపోతున్నారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితులు రావొద్దంటే మనకు మనమే నియంత్రణ చేసుకోవాలని స్పష్టం చేశారు.