తెలంగాణలో మరో 6 పాజిటివ్‌ కేసులు..మంత్రి ఈటెల

తెలంగాణలో 10 మంది కరోనాతో కోలుకున్నారు. మంత్రి ఈటెల

‘కరోనా వైరస్‌ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించొద్దని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వలస కార్మికులకు భోజనం ఏర్పాటు చేస్తున్నామని’ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. కరోనా నియంత్రణ తదితర అంశాలపై మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఇప్పటి దాకా విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా పాజిటివ్‌గా నిర్ఱారణ అయింది. ఇవాళ కొత్తగా 6 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 65కు చేరుకుంది. వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో గొప్ప వసతులతో కరోనా వార్డులు ఏర్పాటు చేశాం.
కరోనాను కట్టడి చేసేందుకు సహకరించాలి. క్వారంటైన్‌ నుంచి తప్పించుకోవాలని చూడొద్దు. విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రార్థనా మందిరాలకు ప్రజలకు వెళ్లకపోవడమే మంచిదని మంత్రి సూచించారు.
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 65 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 10 మందికి నెగిటివ్‌ వచ్చిందని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. తెలంగాణలో 10 మంది కరోనాతో కోలుకున్నారని, రెండు రోజులు పర్యవేక్షించి తర్వాత డిశ్చార్జ్‌ చేస్తామని చెప్పారు. నిన్న, ఇవాళ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిందన్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందన్నారు. క్వారంటైన్‌ వ్యక్తులు బయట తిరిగితే పోలీసులు జైలుకు పంపుతారని హెచ్చరించారు.
‘నాంపల్లిలో ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు కరోనా సోకింది. కుత్బుల్లాపూర్‌లో ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. కరోనా లక్షణాలతో నాంపల్లికి చెందిన 74 ఏండ్ల వృద్ధుడు మృతి చెందాడు. వృద్ధుడి భార్య, కుమారుడిని హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈనెల 14న మతపరమైన కార్యక్రమం కోసం వృద్ధుడు ఢిల్లీ వెళ్లి 17న తిరిగి వచ్చారు. మార్చి 20న వృద్ధుడికి తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. వృద్ధుడు చనిపోయాక అతనికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. మృతుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచామని’ మంత్రి వివరించారు.