కరోనాకు ఎవరూ అతీతులు కాదు. బ్రిటన్ ప్రధానికి, కెనడా ప్రధాని భార్యకు కూడా కరోనా సోకింది. కరోనా యుద్ధం ఎంత దూరం ఉంటుందో తెలియదు. కరోనాపై యుద్ధం చేసేందుకు సన్నద్ధంగా ఉన్నాం. కరోనా వైరస్ వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కరోనాపై మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.
అత్యవసర సమయంలో అదనపు వైద్య సిబ్బందిని మోహరిస్తాం. కరోనా ట్రీట్మెంట్ చేయడానికి 60 ఏళ్లలోపు ఉన్న వైద్యులంతా అర్హులే. కామన్ డాక్టర్స్ పూల్, నర్సుల పూల్, ల్యాబ్ టెక్నీషియన్స్ పూల్ రెడీగా ఉంచుకోవాలి. వంద మంది డాక్టర్లు అవసరమైన దగ్గర 30 మందిని ఎక్కువే ఉంచుకోవాలి. వైద్య సేవలకు పేమెంట్ ఇస్తాం. పీజీ మెడికల్ విద్యార్థుల సేవలు కూడా వినియోగించుకుంటామని సీఎం ప్రకటించారు.
సోషల్ మీడియాలో దుష్రచారం చేసేవారికి కఠిన శిక్షలు తప్పవు. దుర్మార్గపు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సామాజిక మాధ్యమాలు కావచ్చు.. ఎక్కడైనా దుష్రచారం చేస్తే ఉపేక్షించం. దుష్ప్రచారం చేసేవారికి ఈ కరోనా సోకాలి..సోకుతుంది. ప్రజల మనోభావాలతో ఆడుకోవాలనుకోవడం దుర్మార్గం. కరోనాకు సంబంధించి ప్రతీ విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెబుతున్నాం. ప్రభుత్వమే అన్ని వివరాలు చెప్తున్నప్పుడు మరో ప్రచారం ఎందుకు? ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ బాధ్యతగా తీసుకుని శ్రమిస్తున్నారు. కరోనా కారణంగా ఆదాయం తగ్గిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కష్టకాలంలో అందరం పాలుపంచుకోవాలి. ఎమ్మెల్యేల జీతాలు కూడా బంద్ చేసే పరిస్థితి వస్తుంది. 3 నెలల పాటు ఇబ్బందులు తప్పవు. అని కేసీఆర్ పేర్కొన్నారు.