జన్‌ధన్‌ ఖాతాల్లోకి డబ్బులు

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గరీబ్‌ కల్యాణ్‌యోజన పథకం డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయి. కేంద్రం ప్రకటించినట్లుగా జన్‌ధన్‌యోజన ఖాతాల్లోకి రూ.500 చొప్పున జమ చేశారు. ఏప్రిల్‌ నుంచి మూడు మాసాలపాటు నెలకు రూ.500 చొప్పున జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌కు సంబంధించిన నిధులు ఇప్పటికే ఖాతాల్లో జమయ్యాయి. డబ్బులు జమైనట్లుగా ఎస్‌ఎంఎస్‌ వచ్చిన ఖాతాదారులు ఏటీఎంలు బ్యాంక్‌ మిత్రా, వినియోగదారుల సేవాకేంద్రాల ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. తప్పనిసరి బ్యాంక్‌లకు వచ్చే వారు గుంపులు గుంపులుగా రాకూడదని, వచ్చిన వారు సామాజిక దూరం పాటించి, మాస్క్‌లు ధరించి మాత్రమే బ్యాంక్‌లకు రావాలని ఆయన సూచించారు. బ్యాంకుల్లోకి కేవలం ముగ్గురిని మాత్రమే అనుమతిస్తామని, ఎక్కువమంది రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.