
రాష్ట్రంలో కరోనా వైరస్(కోవిడ్-19) నివారణకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే కరోనా వైరస్ వంటి వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడంపై తెలంగాణ ప్రభుత్వం తాజా నిషేధం విధించింది. రోడ్లు, సంస్థలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని ప్రభుత్వం హెచ్చరించింది.
‘ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి ప్రబలుతోంది. వ్యక్తిగత శుభ్రతతో పాటు బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తప్పనిసరి. అనారోగ్యకరమైన అలవాట్లను మానుకోవాలి. ప్రజారోగ్యం, వైరస్లు, తదితర వ్యాధుల వ్యాప్తి, భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో పాన్, గుట్కా, పొగాకు ఉత్పత్తులు నమిలి ఉమ్మడంపై ప్రభుత్వ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని’ తెలంగాణ ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.