ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీ చేయాలని ఆయన స్పష్టం చేశారు. మాస్కుల వల్ల కొంత రక్షణ లభిస్తుందని.. వీలైనంత త్వరగా పంపిణీ జరగాలని అధికారులను ఆదేశించారు. కరోనా నివారణా చర్యలపై సీఎం వైఎస్ జగన్ తన నివాసంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాల సర్వే పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. శనివారం రాత్రికి వరకు 32,349 మందిని ఎన్ఎంలు, ఆశావర్కర్లు వైద్యాధికారులకు రిఫర్చేశారని.. ఇందులో 9,107 మందికి పరీక్షలు అవసరమని అధికారులు చెప్పారు. అయితే, వీరేకాకుండా మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా కోవిడ్ కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45 వేల వైరస్ నిర్ధారణ పరీక్షలకు వైద్య శాఖ సిద్ధమవుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వైరస్ వ్యాప్తి, ఉద్ధృతిని అంచనా వేసేందుకు ఈపరీక్షలు నిర్వహిస్తామని సీఎంకు తెలిపారు. కోవిడ్ వ్యాప్తి ఉన్నజోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామని అన్నారు.
వారిపై ప్రత్యేక దృష్టి..
హైరిస్కు ఉన్న వారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. వృద్ధులు, మధుమేహం, బీపీ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్పించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. నమోదవుతున్న కరోనా కేసులు, వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సీఎం చెప్పారు.

