
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 8, చిత్తూరులో 2, కృష్ణా జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకటి చొప్పున పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరుకుంది. రోనా బారినపడి గుంటూరులో ఓ వ్యక్తి మరణించాడు. జిల్లాలోని దాచేపల్లికి చెందిన బాధితుడు శ్వాస సంబంధిత సమస్యలతో ఈ నెల 9న పిడుగురాళ్ల ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరులోని ఐడీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అతడి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలింది.
అతడు పదో తేదీ అర్ధరాత్రి దాటాక 1:30 సమయంలో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. 65 ఏళ్ల వృద్ధుడు ఒకరు కోలుకుని విజయవాడ జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12కి చేరింది. కాగా, గుంటూరులో అత్యధికంగా 89 కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానంలో కర్నూలు (84), నెల్లూరు (52) ఉన్నాయి. అనంతపురంలో అత్యధికంగా 15 కేసులు నమోదయ్యాయి.