
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖ సింగర్ మంగ్లీ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు మణికొండలోని Ghmc పార్క్ లో మంగ్లీ మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంగ్లీ(సత్యవతి) మాట్లాడుతూ.. ఒకప్పుడు మన పూర్వీకులు ఎండాకాలం వచ్చిందంటే చెట్లకింద కూర్చుని సేదతీరేవారనీ, కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో చెట్లు అంతరించిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చెట్లు అంతరించిపోవడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగడమే కాకుండా భూ మండలం వేడెక్కుతోందని ఆమె అన్నారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ అన్న కు వచ్చిన ఆలోచన చాలా గొప్పదని ఆయన ఆలోచనకు నేను సెల్యూట్ తెలుపుతున్నానన్నారు. ఇంత మంచి ఆలోచన చేసిన సంతోషన్నకు కృతజ్ఞతలు అని మంగ్లీ తెలిపారు. ఈ సందర్భంగా మంగ్లీ మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. వారిలో సుడిగాలి సుధీర్, యాంకర్ శ్రీముఖి, జార్జి రెడ్డి సినిమా హీరో సందీప్ మాధవ్ లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.