కరోనా వైరస్ వల్ల దారుణంగా దెబ్బతిన్న దేశాల్లో ఇటలీ ఒకటి. నగరాల్లో కాలుష్యం స్థాయికి అక్కడ కరోనా వ్యాప్తికి మధ్య సంబంధం ఉన్నట్టు ఇటలీలో జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రామాణిక స్థాయిని మించిన ధూళి కణాలు సంవత్సరంలో వందరోజులకు మించి ఉండే నగరాల్లో కరోనా రిస్క్ మూడింతలు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ వెరోనా, స్టాన్ఫర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ఇటలీకి మాత్రమే పరిమితం. కాలుష్యానికి, కరోనా పాజిటివ్లు పెరగడానికి మధ్యగల సంబంధం ఏమిటో ఈ అధ్యయనం వెల్లడించలేదు. ఈ నిర్ధారణలు కేవలం సూచనమాత్రంగా ధోరణులను వివరిస్తాయి తప్ప వీటిని సాధారణీకరించలేమని నిపుణులు అంటున్నారు. మొత్తంమీద వాతావరణ కాలుష్యం అనేది ఏదోరకంగా కోవిడ్-19 ఇన్ఫెక్షన్లను పెంచుతుందనేది ఈ అధ్యయనం సారాంశం. దీనిపై మరింత లోతుగా అధ్యయనాలు జరగాల్సి ఉంది.