ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలి

ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్‌ వసతి కల్పించాలని తెలిపారు. భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో   చిక్కుకుపోయిన వారు తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చ  జరిగింది. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్,  వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి సహా ఇతర అధికారులు హాజరయ్యారు.

కనీసం లక్ష పడకలు సిద్ధం చేసుకోవాలి..
కనీసం లక్ష పడకలు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. అంగన్‌వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్‌ శాఖ  గ్రామాల్లో కరోనా క్వారంటైన్‌ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్‌ వాహనాలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటుచేసి పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. కేసుల తీవ్రత ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేసి నిత్యావసరాల కోసం ఒక వ్యక్తికే పాసు ఇవ్వాలని సీఎం తెలిపారు. వైద్యుడు, ఏఎన్‌ఎం,ఆశా కార్యకర్త, మందులు కూడా మొబైల్‌ యూనిట్‌కు అందుబాటులో ఉంచాలని సీఎం అన్నారు.

లాక్‌డౌన్‌ పొడిగింపు, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలపై సమీక్ష
కేంద్ర హోంశాఖ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కడెక్కడ కంటెన్‌మెంట్‌ జోన్లు ఉండాలన్న దాన్ని గుర్తించి, అక్కడ అనుసరించాల్సిన విధానాలపై విధివిధానాలు తయారుచేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. అనుమతులు ఉన్న దుకాణాల వద్ద పాటించాల్సిన ఎస్‌ఓపీలను ఇవ్వాలని సీఎం తెలిపారు.