విశాఖ ఘటన: హెల్ప్‌లైన్‌ నెంబర్లు ప్రారంభించిన ప్రభుత్వం

విశాఖపట్నం ఎల్‌జీ గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేసిందని ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి ట్వీట్‌ చేశారు. ఘటనపై ఎలాంటి సమాచారం కోసమైనా డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌ ప్రసాదరావును సంప్రదించాలని తెలిపారు.

ఇందుకు హెల్ప్‌లైన్‌ నెంబర్లు 7997952301… 8919239341 అందించారు. అలాగే మరో అధికారి ఆర్‌ బ్రహ్మ అందుబాటులో ఉన్నారని (9701197069) ఆయన్ను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పరిశ్రమకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలను తరలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు భయపడవద్దని, అధికారులకు సహాకరించాలని మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.