ఏపీకి వచ్చేందుకు 30 వేల మంది రిజిస్ట్రేషన్‌ – కోవిడ్‌–19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణబాబు

ఇతర దేశాల నుంచి ఏపీకి వచ్చేందుకు 30 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, వీరిలో టిక్కెట్లు రద్దు చేసుకున్న వారు పోగా, 15 నుంచి వేల 20 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు కోవిడ్‌–19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు పేర్కొన్నారు. ఇందులో 65 శాతం మంది గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చేవారు ఉన్నారన్నారు. శనివారం విజయవాడలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో నోడల్‌ అధికారి ఆర్జా శ్రీకాంత్‌తో కలిసి కృష్ణబాబు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలకు విశాఖపట్నం, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు విజయవాడ విమానాశ్రయం, నెల్లూరు, రాయలసీమ నాలుగు జిల్లాలకు తిరుపతి ఎయిర్‌పోర్టులు కేటాయిస్తున్నామన్నారు. నార్త్, సౌత్‌ అమెరికా నుంచి వచ్చే విమానాలు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌కు చేరితే అక్కడి నుంచి విమానాల్లో తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

దేశంలో ఏపీ, కేరళ రాష్ట్రాలు మాత్రమే ఉచిత క్వారంటైన్‌ సదుపాయం కల్పిస్తున్నాయని, మిగిలిన రాష్ట్రాల్లో పెయిడ్‌ క్వారంటైన్‌ అందిస్తున్నారన్నారు. ఈనెల 11న అమెరికా నుంచి మొదటి విమానం హైదరాబాద్‌కు చేరుకుంటుందని, ఇతర దేశాల నుంచి రాగానే, రిసెప్షన్‌ టీం ఉంటుందని, అక్కడే ఆర్‌టీపీసీఆర్, ట్రూనాట్‌ పరీక్షలు చేస్తామన్నారు. అంతర్‌రాష్ట్ర రవాణాకు మరింత వెసులుబాటు కల్పించేందుకు డాక్యుమెంట్లతో కూడిన పత్రాలను  టp్చnఛ్చీn్చ. జౌఠి. జీnకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నేరుగా ఈ–పాస్‌లు దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్స్‌కు వస్తాయి. సహేతుక కారణాలు, సంబంధిత డాక్యుమెంట్లను పొందుపరచాలి.