టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో వలస కార్మికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. ఈ నేపథ్యంలో మే 20న తన బర్త్డేను పురస్కరించుకొని..ఉపాధి లేక, స్వస్థలాలకు చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవడానికి మనోజ్ ముందుకు వచ్చారు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు వలస కార్మికులు హైదరాబాద్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న మనోజ్..కార్మికులు, కూలీలను సొంత ఊళ్లకు తరలించే బాధ్యత తీసుకున్నారు. మంచు మనోజ్ బుధవారం హైదరాబాద్లోని మూసాపేట నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురిని 2 బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపించారు. వాళ్లకు అవసరమైన ఆహారంతో పాటు మాస్క్లు, శానిటైజర్స్ను కూడా ఆయన అందజేశారు.
మనోజ్ టీమ్ వలస కార్మికులు తమ ఇళ్లకు చేరేంతవరకు మార్గమధ్యంలో అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు. అదేవిధంగా గురువారం నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను హైదరాబాద్ నుంచి వారి ఊళ్లకు బస్సుల్లో పంపేందుకు మనోజ్ ఏర్పాట్లు చేస్తున్నారు.