దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు దేశ వ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 11,929 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్లో ఇప్పటి వరకు 3,20,922 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 9195 మంది చనిపోయారు. 1,62,379 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
మధ్యస్థ దశలో ఉన్న కొవిడ్-19 రోగులకు యాంటీ వైరల్ ఔషధం రెమెడెసివిర్ను వాడాలని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం సిఫారసు చేసింది. అయితే, ఇతర వ్యాధులతో బాధపడే వారికి, గర్భిణిలు, 12 ఏండ్ల లోపు పిల్లలకు దీనిని సిఫారసు చేయవద్దని వెల్లడించింది. హైడ్రాక్సీక్లోరోక్విన్ను తొలిదశలోని వైరస్ రోగులకు మాత్రమే వాడొచ్చన్నది. తీవ్రమైన కేసుల్లో ఇవ్వకూడదని చెప్పింది. ఈమేరకు గతంలో జారీ చేసిన ‘క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఫర్ కొవిడ్-19’ మార్గదర్శకాలకు పలు సవరణలు చేసింది. తీవ్రమైన లక్షణాలతో బాధపడే వారికి అజిత్రోమైసిన్తో కలిసి హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాన్ని ఇవ్వడాన్ని నిలిపివేయాలని స్పష్టం చేసింది.