తెలంగాణలో 25 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే 1,831 కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ లో 1,419 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్‌మల్కాజిగిరి 117, ఖమ్మం 21, మెదక్‌, మంచిర్యాల 20 చొప్పున, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, వరంగల్‌అర్బన్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి జిల్లాల్లో 9 చొప్పున, వికారాబాద్‌ 7, సూర్యాపేట 6, కరీంనగర్‌ 5, జగిత్యాల 4, సంగారెడ్డి 3, మహబూబాబా ద్‌, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, జోగుళాంబగద్వాల జిల్లాల్లో 1 కేసు చొప్పున వెలుగుచూశాయి. అటు.. రికార్డుస్థాయిలో ఒకేరోజు 2,078 మంది కోలుకొన్నారు. వైరస్‌తోపాటు ఇతర అనారోగ్య కారణాలతో 11 మంది మృతిచెందా రు. మొత్తం మృతుల సంఖ్య 306కు చేరింది. ఒక్కరోజే 6,383 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య 1,22,218కు చేరింది. సంగారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్‌ ఒకరు కరోనాతో గాంధీ దవాఖానలో మృతిచెందారని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఓ బాలింత (35) మృతిచెందింది.