నిర్వహణ లోపంతోనే విశాఖ సాల్వెంట్స్ లిమిటెడ్‌లో అగ్ని ప్రమాదం

  • విశాఖ సాల్వెంట్స్‌ లిమిటెడ్‌లో దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక
  • మంటల్లో ఓ కార్మికుడు మృతి.. మరొకరికి గాయాలు
  • మృతుని కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రూ.15లక్షలు, యాజమాన్యం 35లక్షల పరిహారం

నిర్వహణ లోపంతోనే విశాఖ జిల్లా పరవాడ మండలంలోని విశాఖ సాల్వెంట్స్‌ లిమిటెడ్‌లో అగ్ని ప్రమాదం సంభవించిందని నిపుణుల కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. ప్లాంట్‌ రియాక్టర్‌లో ‘డై మిథైయిల్‌ సల్ఫాక్సైడ్‌’ డిస్టిలేషన్‌ ప్రక్రియ కొసాగుతుండగా ప్రమాదం సంభవించిందని తెలిపింది. ► ఈ దుర్ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందడంతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడిన ఈ ప్రమాదంపై విచారణకు విశాఖ జిల్లా కలెక్టర్‌ ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు.
► ఈ కమిటీ రియాక్టర్‌ను పరిశీలించి మంగళవారం కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది.
► రియాక్టర్‌లో పరిమితికి మించి వాక్యూమ్‌ పెరగడం.. రసాయన మిశ్రమాల్లో ఉష్ణోగ్రత పెరగడంతో ప్రమాదానికి దారితీసింది.
మంటలు పూర్తిగా అదుపులోకి..
కాగా, సోమవారం రాత్రి ఉవ్వెత్తున లేచిన మంటలను మంగళవారం ఉ.6గంటలకల్లా పూర్తిస్థాయిలో అదుపుచేశారు.
► ప్రమాద సమయంలో రియాక్టరు వద్దనున్న కాండ్రేగుల శ్రీనివాస్‌ అనే కార్మికుడు అగ్నికి ఆహుతైనట్లు మంగళవారం గుర్తించారు. ► అతని కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ.15 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మరో రూ.35 లక్షలు ఇచ్చేందుకు పరిశ్రమ యాజమాన్యం అంగీకరించింది.
► అలాగే, ప్రమాదంలో మల్లేశ్‌ అనే మరో కార్మికుడికి గాయాలయ్యాయి. అతనికి ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. వైద్యానికయ్యే ఖర్చుతో పాటు రూ.20 లక్షల పరిహారం ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించింది.
► ప్రమాదం విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి సుచరిత, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆరా తీశారు. ► విచారణ కమిటీ తుది నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు.
► ప్రమాదంపై పరవాడ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. పేలుడు సంభవించిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం గంటల వ్యవధిలో పరిస్థితిని అదుపులోనికి తీసుకురావడంతో మంగళవారం ఫార్మాసిటీలో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి.