నల్లగొండ జిల్లాలోని నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హరితవనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ హరితవనంలో విస్తృతంగా మొక్కలు నాటాలని జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి హరితవనాన్ని పరిశీలించారు.
అనంతరం హరితహారంలో భాగంగా బ్లాక్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుంటిపల్లి బ్లాక్ ప్లాంటేషన్ లో మొక్కలు నాటి జిల్లాలోనే మోడల్ బ్లాక్ ప్లాంటేషన్ హరితవనంగా అభివృద్ధి పరచాలని ఆదేశించారు. 32 ఎకరాల స్థలంలో బ్లాక్ ప్లాంటేషన్ కింద 10 వేల మొక్కలు నాటాలన్నారు. బ్లాక్ ప్లాంటేషన్ కు అప్రోచ్ రోడ్డు, అంతర్గత రోడ్డు, పైపు లైన్, బోరు మంజూరుకు ప్రతి పాదనలు పంపాలని స్థానిక ఎంపీడీవోను ఆదేశించారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు కూడా అంచనాలు రూపొందించి పంపాలని సూచించారు.