కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్యకు కరోనా పాజిటివ్‌

కర్ణాటకలో కరోనా విలయం కొనసాగుతున్నది. నిత్యం వేలల్లో జనం మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించగా.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా విషయాన్ని ధ్రువీకరించారు. వైద్యుల సూచన మేరకు దవాఖానలో చేరానన్నారు. ఇటీవల తనను కలిసిన వారు లక్షణాలుంటే క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

ఇంతకు ముందు సీఎం యడ్యూరప్పతో పాటు వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్‌తో పాటు ఆయన భార్య ఇటీవల వైరస్‌ బారినపడ్డారు. అంతకు ముందు అటవీశాఖ, పర్యాటక శాఖ మంత్రులు ఆనంద్‌ సింగ్‌, సీటీ రవి కొవిడ్‌-19 సోకింది. అలాగే సోమవారం కాంగ్రెస్‌ నేత ఆర్‌ ప్రసన్నకుమార్‌ సైతం వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,39,571 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 74,469 యాక్టివ్‌ కేసులుండగా, 62,500 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 2,594 మంది వైరస్‌ ప్రభావంతో మరణించారు.