శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగిన ప్రాంతం నుంచి ఎన్డీఆర్ఎఫ్ సహాయక సిబ్బంది ఐదు మృతదేహాలను వెలుపలికి తీసుకువచ్చారు. వీరిలో ఒకరిని ఏఈ సుందర్ నాయక్(35)గా అధికారులు గుర్తించారు. మరో నలుగురిని గుర్తించాల్సి ఉంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో ఈ ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
ఒక్కసారిగా విద్యుత్ కేంద్రంలో పొగలు అలుముకోవడంతో అధికారులు వెంటనే ఉత్పత్తిని నిలిపివేశారు. మంటలు ఆరిపోగా పొగలు మాత్రం దట్టంగా అలుముకున్నాయి. విద్యుత్ కేంద్రం నుంచి 8 మంది సురక్షితంగా బయటకు రాగా మరో 9 మంది అందులోనే చిక్కుకుపోయారు. వీరిలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మిగతా నలుగురి ఆచూకీ కోసం అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
మృతుడు సుందర్ నాయక్ది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జగన తండా. భార్య ప్రమీల ఇద్దరు కూతుళ్లు మనస్వి, నిహస్వి ఉన్నారు. నెల రోజులక్రితం కరోనా పాజిటివ్గా తేలడంతో సుందర్ నాయక్ సొంతూరుకు వచ్చి 15 రోజులు హోం క్వారైంటన్లో ఉండి కరోనాను జయించారు. నిన్న రాత్రే 9 గంటలకు విద్యుత్ కేంద్రంలో విధులకు హాజరయ్యారు. తెల్లారేసరికి ఇలా విగతజీవిగా మారాడు.