మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌ రెడ్డి కన్నుమూత

కొద్ది రోజుల కిందట నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌ రెడ్డి (67) శుక్రవారం రాత్రి  కన్నుమూశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో జగదీశ్వర్‌రెడ్డి చురుకుగా పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, మాజీ కేంద్రమంత్రి మల్లికార్జున్‌ అనుచరుడుగా జగదీశ్వర్‌రెడ్డికి పేరుంది. ఉద్యమ సమయంలో జైలుకు కూడా వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జగదీశ్వర్‌రెడ్డి కొంతకాలం టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. జగదీశ్వర్‌రెడ్డికి భార్య కుమారుడు నలుగురు కూతుళ్లు ఉన్నారు. వివాద రహితుడిగా పేరున్న ఆయన మృతికి అన్ని పార్టీల నాయకులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జగదీశ్వర్‌ రెడ్డి మృతిపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జగదీశ్వర్‌రెడ్డి మృతి తమకు తీరనిలోటని కాంగ్రెస్‌ జిల్లా ప్రచార కార్యదర్శి బెనహర్‌ అన్నారు.