కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ ఎంపీలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. నూతన వ్యవసాయ బిల్లు తేనేపూసిన కత్తి లాంటి చట్టం. దీన్ని కచ్చితంగా వ్యతిరేకించి తీరాలి అని సీఎం స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందన్నారు. రైతులను దెబ్బ తీసి కార్పోరేటు వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉందని సీఎం పేర్కొన్నారు. పైకి చెప్పడానికి రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారు. కానీ వాస్తవానికి ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానం కార్పోరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు దారులు బార్ల చేయడానికి ఉపయోగపడే బిల్లుగా ఉందని తెలిపారు. రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు. నిజానికి రైతులు తమకున్న కొద్దిపాటు సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా? ఇది తేనె పూసిన కత్తిలాంటి చట్టం. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి.
ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50 శాతం సుంకం అమలులో ఉంది. దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 70-75 లక్షల టన్నులను కొనుగోలు చేసింది. 35 శాతం సుంకం తగ్గియడం ఎవరి ప్రయోజనం ఆశించి చేసింది. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉండే సమయంలో ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు. మన దేశంలోనే పుష్కలంగా మక్కలు పండుతున్నాయి. సుంకం తగ్గించి మరీ మక్కలు దిగుమతి చేస్తుంటే మన దేశ రైతుల పరిస్థితి ఏమిటి? “అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు.