సంచలన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో .. లక్నోలోని సీబీఐ కోర్టు తీర్పును ఇవాళ వెలువరించింది. బాబ్రీ మసీదు కూల్చివేత ముందుగా అనుకున్న పథకం ప్రకారం చేసింది కాదు అని కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 32 మంది నిర్దోషులే అంటూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. 2000 పేజీలు ఉన్న తీర్పు కాపీనీ న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ చదివారు. సీబీఐ సమర్పించిన ఆడియో, వీడియా ఆధారాల మూలంగా నిందితులను దోషులగా తేల్చలేమని కోర్టు చెప్పింది. నిందితులపై ఇచ్చిన ఆధారాలు బలంగా లేవని కోర్టు అభిప్రాయపడింది. కోర్టు తీర్పుతో అద్వానీ సహా 32 మంది నిర్దోషులుగా తేలారు.ఇవాళ లక్నో కోర్టులో బాబ్రీ మసీదు కూల్చివేత విచారణ జరిగింది. 32 మంది నిందితుల్లో 26 మంది కోర్టుకు హాజరయ్యారు. ఆరుగురు హాజరుకాలేదు. హాజరుకాని వారిలో అద్వానీ, జోషీ, ఉమాభారతిలు ఉన్నారు. 1992, డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ లక్నో సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. అయితే బాబ్రీని కూల్చినవాళ్లు సంఘవ్యతిరేకులు అని ఇవాళ కోర్టు తన తీర్పులో పేర్కొన్నది.
మసీదు కూల్చివేత సమయంలో అక్కడ ఉన్న నేతలంతా .. ఆగ్రహంతో ఉన్న జనాల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని న్యాయమూర్తి ఎస్కే యాదవ్ తెలిపారు. భారీ జనసమూహాన్ని రెచ్చగొట్టే విధంగా ఎవరూ ప్రవర్తించలేదని తీర్పులో పేర్కొన్నారు. వివాదాస్పద ప్రాంతానికి వెనుక భాగం నుంచి రాళ్లు రువ్వడం జరిగిందన్నారు. మసీదు సమీపంలో హిందూ దేవతామూర్తుల విగ్రహాల ఉన్నాయని, అందుకే ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచేందుకు అశోక్ సింఘాల్ ప్రయత్నించినట్లు జడ్జి యాదవ్ తెలిపారు.
ఎల్.కె.ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి వంటి భాజపా అగ్రనేతలు, సంఘ్పరివార్ నేతలు, రామాలయ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, ప్రస్తుత ట్రస్ట్ సారథి నృత్యగోపాల్ దాస్, సాధ్వి రితంబర వంటి ప్రముఖులు నిందితులుగా ఉండడంతో ఈ కేసులో తీర్పుపై దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన విషయం తెలిసిందే. 16వ శతాబ్దం నాటి మసీదును కూల్చేలా కరసేవకులను ఉసిగొల్పేందుకు వీరు కుట్ర పన్నారని సీబీఐ ఆరోపించింది. అయితే, రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో ఇరికించిందని, మేము నేరం చేశామనడానికి ఎలాంటి ఆధారం లేదని విచారణలో భాగంగా నిందితులు వాదించారు. సుదీర్ఘకాలం విచారించిన అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తాజాగా తీర్పు చెప్పింది.
తీర్పు సారాంశం..
బాబ్రీ మసీదు కూల్చివేత ముందస్తు పథకం కాదునిందితులపై తగినన్ని సాక్ష్యాధారాలు లేవుసీబీఐ సమర్పించిన ఆడియో, వీడియో సరిగా లేవుమసీదు డోమ్ ఎక్కిన వారు సంఘ విద్రోహులు మసీదు వద్ద మాట్లాడిన ఆడియో ప్రసంగం స్పష్టంగా లేదు