కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య

రూ.కోటీ పది లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అతడు ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు. కీసర మండలం తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న నాగరాజును ఇటీవల రూ.కోటీ పది లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ బృందం దాడులు చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో అతనిపై కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం అతన్ని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున జైల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి నాగరాజు కిటికీకి టవల్‌తో ఉరివేసుకుని కనిపించాడు. దీంతో అప్పటికప్పుడు అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెంది నట్లు వైద్యులు ధ్రువీకరించారని జైలు అధికారులు తెలిపారు. 

ఉస్మానియాలో పోస్టుమార్టం..
నాగరాజు మృతదేహాని కి ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్‌ నిపుణుడు దేవరాజ్‌ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం పోస్టుమార్టం జరిపింది. అనంతరం మృతదేహాన్ని బంధువుల కు అప్పగించారు. కాగా బుధవారం రాత్రి నాగరాజు మృతదేహాన్ని అల్వాల్‌లోని నివాసానికి తీసుకొచ్చారు. గురువారం అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు వెల్లడించారు.