27 మూగజీవాల దత్తత : గ్లాండ్‌ ఫార్మా ప్రకటన

ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, సంరక్షణ పట్టించుకోక ఎన్నోరకాల జంతుజీవజాతులు అంతరించిపోతున్నాయి. నేటితరం చూడని మూగజీవాలెన్నో ఉన్నాయి. ఈ తరుణంలో జంతు సంరక్షణకు ముందుకొచ్చింది హైదరాబాద్‌ దూలపల్లిలోని గ్లాండ్‌ ఫార్మా లిమిటెడ్‌. శనివారం సంస్థ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్‌) హెడ్‌ రఘురామన్‌ జూపార్క్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్లాండ్ ‌ఫార్మా లిమిటెడ్‌, పయనీర్‌ హిపరెన్‌ టెక్నాలజీ సీఎస్‌ఆర్‌ సభ్యులు సంపత్‌కుమార్‌, సిల్పి సాహేతో కలిసి ఆయన 27 జంతువులను ఏడాది పాటు దత్తత తీసుకుంటామని ప్రకటించారు. జంతువుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు ముందుకురావాలని, సమాజ హితంతో పాటు పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని రఘురామన్‌ చెప్పారు. పెద్ద ఎత్తున జంతువుల దత్తతకు ముందుకురావడం ఇదే తొలిసారని జూపార్క్‌ క్యురేటర్‌ క్షితిజ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్‌ అసిస్టెంట్‌ క్యూరేటర్‌ నాగమణి, ప్రజా సంబంధాల అధికారి హనీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.