ఫిబ్రవరి 22తో ముగియనున్న ప్రస్తుత అసెంబ్లీ గడువు, ఢిల్లీలో మొత్తం 70 స్థానాల్లో ఎన్నికలు. 13750 పోలింగ్ కేంద్రాలు, ఢిల్లీలో ఒక కోటి నలభై ఆరు లక్షల మంది ఓటర్లు
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 70 అసెంబ్లీ స్థానాలకు జనవరి 14న నోటిఫికేషన్ విడుదల కానుందని సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. అలాగే ఫిబ్రవరి 8న పోలింగ్, ఫిబ్రవరి 11న ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి రానుందని అరోరా తెలిపారు. ఫిబ్రవరి 22తో ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియనున్న విషయం తెలిసిందే. అధికార ఆమ్ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 67 స్థానాలను దక్కించుకుని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ చరిత్ర సృష్టించింది.