కాలుష్యం, కరోనా మహమ్మారి నేపథ్యంలో బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో టపాసుల నిషేధంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 23 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. టపాసుల విక్రయాలపై నిషేధం విధించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా ఈ నెల 10 నుంచి 30 వరకు టపాసులను నిషేధించాలా? వద్దా? అని ఎన్జీటీ చైర్మన్ ఆదర్శకుమార్ గోయల్ ధర్మాసనం బుధవారం రాష్ట్రాల స్పందన కోరింది.

కొవిడ్-19, వాయుకాలుష్యంపై నిపుణుల అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయని, పెరిగిన వాయు కాలుష్యంతో వైరస్ మరింత నష్టం నలిగించవచ్చని ధర్మాసనం పేర్కొంది. నేషనల్ క్యాపిటర్ రీజియన్ను దాటి ప్రొసీడింగ్స్ పరిధిని పొడగించాల్సిన అవసరం కూడా ఉందని ట్రిబ్యునల్ తెలిపింది. కొవిడ్-19 రోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపిన నేపథ్యంలో క్రాకర్స్ అమ్మకాలపై ఇప్పటికే నిషేధం విధించిన ఒడిశా, రాజస్థాన్లకు ఎన్జీటీ నోటీసులు ఇవ్వలేదు. మరో వైపు ఢిల్లీ గ్రీన్ క్రాకర్స్ పేల్చేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. కొవిడ్ పరిస్థితి పిల్లలు, వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య కారణాలున్న వ్యక్తులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది.
ఇప్పటికే దేశ రాజధానిలో గాలి నాణ్యత ప్రమాణాలు భారీగా పడిపోయిన విషయాన్ని ఎన్జీటీ గుర్తు చేసింది. పటాకులు శబ్దాన్ని సృష్టించడంతో పాటు విషయావులు విడుదలవుతాయని, ఇవి శ్వాసకోశ, పల్మనరీ వ్యాధులు, మధుమేహం, రక్తపోటు ఇతర వ్యాధులకు దారి తీస్తాయని చెప్పింది. పండుగ కాలంలో వాయుకాలుష్యం కారణంగా కొవిడ్ కేసులు పెరుగుతాయని కేంద్ర, ఢిల్లీ ఆరోగ్యమంత్రులు చేసిన ప్రకటనను సైతం ఈ పిటిషన్లో ప్రస్తావించారు. ఇది పేలవమైన విజిబిలిటీ, మసకగా ఉండే పరిస్థితులు అస్ఫిక్సియాకు దారితీస్తుందని పిటిషనర్లు పేర్కొన్నారు.