పటాకులు అమ్మినా, కాల్చినా రూ.లక్ష వరకు జరిమానా : ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్

పటాకులపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం తాజాగా జరిమానాల గురించి కూడా వెల్లడించింది. దీపావళి పండుగ నేపథ్యంలో పటాకులు అమ్మినా లేక కాల్చినా రూ.లక్ష వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ శుక్రవారం ఈ విషయం తెలిపారు. పటాకులు అమ్ముతున్న లేదా కాల్చినట్టుగా కనిపించిన వ్యక్తులపై గాలి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 1981 కింద కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. ఈ చట్టం కింద గరిష్ఠంగా రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చని మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. పటాకుల నిషేధంపై కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ సంస్థ, పర్యావరణ శాఖ, ఢిల్లీ పోలీసులతో కలిసి సోమవారం సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 

కాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి మూడోసారి విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు సుమారు ఏడు వేల వరకు వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే వరుస పండుగలు, గాలి కాలుష్యం కరోనా వ్యాప్తికి కారణమని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పర్యావరణ హిత పటాకులపైనా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి 30 వరకు అన్ని పటాసులపై నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు.