కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ ని అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు

కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్‌తో పాటు మరో వ్యక్తిని అవినీతి నిరోధకశాఖ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో అవినీతికి పాల్పడిన కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్‌ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. శుక్రవారం ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు జరిగాయి. బాన్సువాడకు చెందిన సుధాకర్‌ను కామారెడ్డి పోలీసులు బెట్టింగ్‌ వ్యవహారంలో 15 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ నెల 6న అతనికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడం కోసం సీఐ జగదీశ్‌ రూ. 5 లక్షలు డిమాండ్‌ చేశాడు. ముందుగా రూ.1,39,500లను సుధాకర్‌ సీఐకి ఇచ్చాడు. మిగతా డబ్బులను సైతం వెంటనే చెల్లించాలని సీఐ పలుసార్లు సుధాకర్‌ ఒత్తిడి  పెంచడంతో అతను  ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఈ నెల 19న ఏసీబీ అధికారులు సీఐ జగదీశ్‌తో పాటు ఈ వ్యవహా రంలో మధ్యవర్తిత్వం చేసిన సుజయ్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం కామారెడ్డిలోని సీఐ జగదీశ్‌ ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు సోదాలు జరిగాయి. సీఐ ఇంట్లో విలువైన డాక్యుమెంట్లు, లాకర్‌ కీలు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్టు డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. మధ్యవర్తి సుజయ్‌ను సైతం విచారిస్తున్నామని, సీఐని ఏసీబీ కోర్టులో శనివారం ప్రవేశపెడుతామని చెప్పారు.  దాడులకు సంబంధించి ఏసీబీ అధికారులు 15 రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.