అవినీతి కేసులో అరస్టైన కామారెడ్డి సీఐ జగదీష్ బ్యాంక్ లాక్ర్లో అధికారులు భారీగా నగదును గుర్తించారు. నిజామాబాద్ కంఠేశ్వర్ యాక్సిస్ బ్యాంకు లాకర్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రూ.34.40 లక్షలు. రూ. 9.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలను గుర్తించారు. అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో సీఐ అవినీతికి పాల్పడ్డట్లు తేలడంతో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. కామారెడ్డి పట్టణంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు గ్రూపులలో మొత్తం 18 మందిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరిపై కేసు నమోదు చేయకుండా ఉండటం, మరికొందరికి స్టేషన్ బెయిల్ ఇస్తామంటూ బేరసారాలు కుదుర్చుకుని రూ. 5 లక్షలకు డీల్ చేసుకున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది.
