దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం వాయు కాలుష్యం మళ్లీ పెరిగింది. ఉదయం 7గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 394 రికార్డింది. ఉదయం 8.30 గంటలకు సఫ్దర్జంగ్ వద్ద 300 మీటర్ల దూరం వరకు ఎదురుగా వచ్చేవి ఏమీ కనిపించలేదు. అలాగే పాలం ప్రాంతంలో దట్టంగా పొగమంచు కురిసింది. ఇదిలా ఉండగా సోమవారం నుంచి గాలి నాణ్యత మెరుగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ సంస్థలు అంచనా వేశాయి. గాలి నాణ్యత 0-50 మధ్య ఉంటే శుద్ధమైందిగా, 51-100 మధ్య సంతృప్తికరంగా, 101-200 మితంగా, 201-300 మధ్య పేలవమైన, 301-400 చాలా పేలవమైన, 401-500 తీవ్రమైన కాలుష్యంగా పరిగణిస్తున్నారు. నార్త్ ఢిల్లీపై నుంచి బలమైన ఉత్తర- పశ్చిమ గాలులు వీస్తాయని, దీంతో గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుందని ఐఎండీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. సిస్టమ్ ఫర్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సాఫర్) పంటల కొయ్యల దహనం తగ్గడంతో భారీగా కాలుష్యం తగ్గిందని, గాలి నాణ్యత మరింత మెరుగుపడే అవకాశం ఉందని తెలిపింది.
