రెండో విడుత రైతుబంధు పంపిణీకి సంబంధించి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ నెల 27 నుంచి జనవరి 7వ తేదీ వరకు రైతుబంధు సాయం పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు సాయం అందించాలన్నారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బు జమ చేయాలని ఆదేశించారు. రైతుబంధు కోసం రూ. 7,300 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రైతులందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలన్నారు.