అగ్రిగోల్డ్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా జప్తుచేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశాలోని రూ.4109 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో ఏపీలో సుమారు 48 ఎకరాల్లో ఉన్న హాయ్లాండ్ ఆస్తులు కూడా ఉన్నాయి. ఆకర్షణీయ పథకాలతో డిపాజిట్దారుల నుంచి పెద్దఎత్తున నిధులు సేకరించి ఎగ్గొట్టడం ద్వారా మోసానికి పాల్పడిన కేసులో అగ్రిగోల్డ్ నిర్వాహకులు వెంకట రామారావు, శేషు వెంకట నారాయణ, హేమసుందర ప్రసాద్లను ఈడీ అరెస్టు చేసింది. నిందితులను నిన్న కోర్టులో హాజరుపరిచింది. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో దాదాపు 9 లక్షల మంది డిపాజిటర్లను అగ్రిగోల్డ్ యాజమాన్యం దాదాపు రూ.6380 కోట్లు అడ్డంగా ముంచింది. అలా వచ్చిన సొమ్మును ఇతర వ్యాపారాల్లోకి మళ్లించడం ద్వారా మోసానికి పాల్పడినట్లు మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. అయితే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలంటూ నాటి ఉమ్మడి హైకోర్టు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. సంస్థ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని సూచించింది.