గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ నటి కరాటే కళ్యాణి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రముఖులు స్వీకరించి మొక్కలు నాటడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు బిగ్ బాస్ షో 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి తన కుమారుడి తో కలిసి జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు ప్రముఖ నటి కరాటే కళ్యాణి.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందని వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ వారు  మొక్కలు నాటించే  మంచి కార్యక్రమాన్ని నాతో చేపించినందుకు  వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం,  నేను ఎక్కువగా మొక్కలు పెంచుతాను అని తెలిపారు. ప్రజలందరిలో అవగాహన పెరిగి ఎవరికి వారు బాధ్యతగా మొక్కలు పెంచాలని కోరారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మా అందరినీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం చేస్తున్న‌ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.  ప్రముఖ హీరోయిన్  విజయశాంతి( రాములమ్మ), డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్, బిగ్ బాస్ 1 విజేత శివబాలాజీ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాట‌మ‌ని కోరారు. ఈ సందర్భంగా “వృక్ష వేదం” పుస్తకంను ఆమెకు అందజేయడం జరిగింది.