పల్లె ప్రగతి వంటి కార్యక్రమంలో దేశంలో మరెక్కడా లేదని.. తెలంగాణ పల్లెలు ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని.. గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం నిరంతరం కొనసాగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గ్రామాల రూపురేఖలు మారుస్తున్న పల్లెప్రగతి స్ఫూర్తి కొనసాగాలన్నారు. పల్లెప్రగతి పనులు మన గ్రామాలను దేశంలోనే ఆదర్శంగా నిలుపుతున్నాయి. పల్లెప్రగతి లక్ష్యాలు చాలావరకు పూర్తయ్యాయి. మిగిలిన పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధతో పల్లెప్రగతి పనులను సమీక్షించాలని కోరారు.