రేపు అరుణ్‌ సాగర్‌ విశిష్ట పురస్కారాలు

ప్రఖ్యాత కవి, ప్రముఖ పాత్రికేయుడు అరుణ్‌సాగర్‌ విశిష్ట పురస్కారాలను హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం అందించనున్నారు. విశిష్ట పాత్రికేయ పురస్కారాన్ని సాక్షి దినపత్రిక ఎడిటర్‌ వర్ధెల్లి మురళికి, విశిష్ట సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి ప్రొఫెసర్‌ ఎండ్లూరి సుధాకర్‌కు అందించనున్నట్టు అరుణ్‌సాగర్‌ ట్రస్టు తెలిపింది. సాయంత్రం 6.30 గంటలకు పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నది. కార్యక్రమంలో ‘ఫేక్‌ న్యూస్‌, సోషల్‌ మీడియా’ అనే అంశం పై కేంద్ర సమాచార రిటైర్డ్‌ కమిషనర్‌, ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధరాచార్యులు అరుణ్‌సాగర్‌ స్మారకోపన్యా సం చేస్తారని తెలిపింది. గౌరవ అతిథులుగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌, తెలంగాణ సమాచార కమిషనర్‌ కట్టా శేఖర్‌రెడ్డి, టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కే శ్రీనివాస్‌, సినీ దర్శకుడు ఎన్‌ శంకర్‌ హాజరుకానున్నారని పేర్కొన్నది. ప్రత్యేక అతిథులుగా కే శివారెడ్డి, ప్రముఖ పాత్రికేయుడు కే రామచంద్రమూర్తి, టీవీ5 చైర్మన్‌ బీఆర్‌ నాయుడు పాల్గొంటారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ సభాధ్యక్షత వహిస్తారు. ఆన్‌లైన్‌ జూమ్‌ ఐడీ-9133345314, పాస్‌వర్డ్‌-123456 లోనూ ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చని అరుణ్‌సాగర్‌ ట్రస్టు తెలిపింది.