ఈ 31 లోగా ఉద్యోగుల‌ ప‌దోన్న‌తులు పూర్తి చేయాలి : సీఎస్ సోమేశ్ కుమార్‌

హైద‌రాబాద్ జిల్లాలో ప‌నిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగుల ప‌దోన్న‌తుల‌ను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. అదేవిధంగా ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా కారుణ్య నియామ‌కాల‌ను చేప‌ట్టాల‌న్నారు. మంగళవారం బీఆర్‌కేఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫ‌రెన్స్‌ను నిర్వ‌హించారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో అన్ని క్యాటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగుల ప‌దోన్న‌తులు, డీపీసీలు నిర్వహణ, కారుణ్య నియామకాలు, రెవెన్యూ సంబంధిత అంశాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, సెగ్రిగేషన్ షెడ్స్, డ్రైయింగ్ ఫ్లాట్ ఫామ్స్, గ్రామ నర్సరీలు, ఉపాధిహామీ పనులు తదితర అంశాలపై  సీఎస్ చ‌ర్చించారు. 

ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారని కలెక్టర్లకు తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఈ అంశంపై వెంటనే జిల్లా స్ధాయిలో సమావేశం నిర్వహించి ప్రమోషన్ల ద్వారా నింపే ఉద్యోగ ఖాళీల సంఖ్యను అంచనా వేయాలన్నారు. ప్రతి సోమవారం ప్రమోషన్ల, కారుణ్య నియామాకాలపై సమావేశాలు నిర్వహించి ఈ నెల 24 నాటికి పూర్తి చేయాలన్నారు.