ఏపీ హైకోర్టు సీజేగా అరూప్‌ గోస్వామి ప్రమాణం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ అరూప్‌ గోస్వామితో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తోపాటు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఇప్పటివరకు సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ గోస్వామి ఏపీకి బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా పనిచేసిన జేకే మహేశ్వరి.. సిక్కిం ఉన్నత న్యాయస్థానానికి బదిలీ అయ్యారు.  

అంతకుముందు జస్టిస్‌ అరూప్‌ గోస్వామి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సతీసమేతంగా ఆలయానికి వెళ్లిన ఆయనకు దేవాలయ అధికారులు ఘనస్వాగతం పాలికారు. వేకువజామున జరిగిన పంచహారతుల సేవలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.