తెలుగు ప్రజలకు ఏపీ సీఎం జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, మనకంటూ ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని అన్నారు. 

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడి దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కనీవినీ ఎరుగని విధంగా గత 19 నెలలుగా మన రైతన్న సంక్షేమానికి, మన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇక మీదటా ఇదే విధానం కొనసాగుతుందన్నారు. 

భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, పైరుపచ్చల కళకళలు గ్రామాల్లో  సంక్రాంతి శోభను తీసుకొచ్చాయని అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానని సీఎం పేర్కొన్నారు.