మై హోం సిమెంట్స్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో మేళ్లచెరువు ఆలయం వద్ద ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం వద్ద టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైహోమ్ సిమెంట్స్ మైనింగ్ లీజు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో కొన్ని రోజులుగా వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. అది కాస్తా చిలికి చిలికి గాలివానగా మారి మైహోమ్ సంస్థకు ‘మీరంటే – మీరు అమ్ముడుపోయారు’ అంటూ ఇరు పార్టీల నాయకులు సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి తెర తీశారు. ఈ వివాదం నేపథ్యంలో బీజేపీ నాయకులు మేళ్లచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రమాణానికి సిద్ధమయ్యారు.

అందులో భాగంగా తన నిజాయతీని నిరూపించుకునేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి శివాలయంలో ప్రమాణం చేసేందుకు బుధవారం ఆలయానికి వచ్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి బీజేపీ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

వేపలమాధారం, మేళ్లచెరువు గ్రామాల పరిధిలోని 631 ఎకరాల్లో మైనింగ్‌ విస్తరణను మై హోం సంస్థ చేపట్టాలని భావించింది. మైనింగ్‌ విస్తరణ కోసం కొద్ది రోజుల క్రితం ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగింది. దీనిపై దాదాపు 15 రోజులుగా వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. మైనింగ్‌ విస్తరణతో కాలుష్యం పెరుగుతుందని, పొలాల్లో పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని స్థానిక ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. మై హోం సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మై హోం సంస్థకు కొందరు పిసిబి అధికారులు అమ్ముడుపోయి ఆ సంస్థపై ఎవరు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు దీని వెనుక ఉన్న అందరినీ పూర్తి ఆదారాలతో త్వరలో బయటకు లాగుతామని బీజేపీ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. మై హోం సంస్థ చేసే దారుణాలను వాటికి వెనుక వున్న అధికారుల సపోర్టును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని, స్థానిక ప్రజలకు మద్దతుగా ఉంటామని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. పిసిబి అధికారులు డబ్బులు తీసుకుని అమ్ముడుపోయి మైహోం సంస్థ చేసే దారుణాలకు వంత పాడుతుందని ఈ విషయంలో తమ పోరాటం అపేది లేదని స్థానిక ప్రజలు, బీజేపీ నాయకులు, పర్యావరణ వేత్తలు అన్నారు. అంతేకాదు మై హోం సంస్థ మైనింగ్ ప్రజాభిప్రాయసేకరణ కోసం పిసిబి అధికారులకు ఎంత ముట్టచెప్పారో.. ఇంకా ఎవరెవరికీ ఎంత ముట్టిందో పూర్తి అధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు చెబుతున్నారు.