తెలంగాణ‌లో కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఉద‌యం 10:30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను లాంఛ‌నంగా ప్రారంభించారు. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌లోని నిమ్స్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌, గాంధీ ఆస్ప‌త్రిలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌, తిలక్‌న‌గ‌ర్‌లోని యూపీహెచ్‌సీలో ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ టీకాల కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు టీకాల ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 140 కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టారు. ఒక్కో కేంద్రంలో 30 మందికి మించ‌కుండా టీకాను వేస్తున్నారు. ఈ రోజు మొత్తం 4,170 మందికి టీకా వేయ‌నున్నారు. టీకా వేసిన‌ట్లు గుర్తింపుగా ల‌బ్ధిదారుడి ఎడ‌మ‌చేతి బొట‌న‌వేలికి సిరా చుక్కను గుర్తుగా వేస్తున్నారు. ఇవాళ మొత్తం పారిశుద్ధ్య కార్మికులకే టీకా ఇస్తున్నారు. కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో మొత్తం 50 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు.