కాలుష్యానికి కారణమవుతున్న ఫార్మస్యూటికల్‌ కంపెనీలకు రూ.1.55 కోట్ల జరిమానా

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఎన్జీటీ ఆదేశం

తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడి కాలుష్యానికి కారణమవుతున్న ఫార్మస్యూటికల్‌ (పరిశ్రమ) కంపెనీల నుంచి రూ.1.55 కోట్ల జరిమానాను వసూలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. ఆ పరిశ్రమలు జరిమానా చెల్లించకపోతే కఠిన చర్యలు చేపట్టాలని, జరిమానాను చెల్లించేవరకు కంపెనీలని మూసివేయాలని అధికారులకు స్పష్టంచేసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్లలో టీఎస్‌ఐఐసీ సెజ్‌లో ఏర్పాటైన ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్నాయని, కాలుష్య నియంత్రణ చట్టాలను, పర్యావరణ చట్టాలను అవి పాటించటం లేదని శ్రావణ్‌ కుమార్‌ అనే న్యాయవాది జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషన్‌ దాఖలు చేశారు. వాటి అనుమతులు రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పీసీబీకి పై ఆదేశాలు జారీచేసింది.