ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ లేని వినూత్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఇంటివద్దకే రేషన్ సరుకుల సరఫరా వాహనాలను గురువారం ప్రారంభించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జగన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మిగతా జిల్లాలకు కేటాయించిన వాహనాలను ఆయా మంత్రులు ప్రారంభించనున్నారు. రేషన్ సరుకుల కోసం కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు ఎదుర్కొంటున్న అవస్థలను పాదయాత్ర సమయంలో గుర్తించారు. వారికి ఇంటి వద్దనే సరుకులు అందచేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏపీవ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటి నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం 9,260 వాహనాలు సిద్ధం చేశారు. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు.
