సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్కూల్ తలదన్నేలా నిర్మించిన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ చొరవతో ‘గివ్ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ’ సహకారంతో సుమారు రూ.3 కోట్లతో ఈ పాఠశాలను నిర్మించారు. 1960లో ప్రారంభమైన ఈ పాఠశాలలో ప్రస్తుతం 600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా, పాత భవనాలను కూల్చి మొత్తం 33 రూములతో సుమారు వెయ్యి మంది విద్యనభ్యసించేలా అత్యాధునిక వసతులతో నూతన భవనాన్ని నిర్మించారు.

పాఠశాలలో.. రూ.30 లక్షలతో వాలీబాల్, ఫుట్బాల్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఒకేసారి 400 మంది విద్యార్థులు కూర్చుండి భోజనం చేసేలా డైనింగ్ హాల్, అత్యాధునిక గ్రంథాయలం, సురక్షిత తాగు నీరు, 50 కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్, అధునాతనమైన సైన్స్, మాథ్స్ ల్యాబ్లు, మోడ్రన్ టాయిలెట్స్, 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
