గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అనూహ్య మద్దతు లభిస్తున్నది.  అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి  తన జన్మదినం సందర్భంగా మినిస్టర్ క్వార్టర్స్‌ లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. 

17 వ తేదీన సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ‘కోటి వృక్షార్చన’ ఒకే రోజు – ఒకే గంటలో- ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరు మొక్కులు నాటి మొబైల్ నెంబర్‌కు పంపించాలని కోరారు. మొబైల్ యాప్ కోసం మీ వాట్సప్ నుంచి 9000365000 నెంబర్‌కు GIC అని మెసేజ్ చేయాలని పిలుపునిచ్చారు. హరిత సంకల్పంలో మీ కృషికి గుర్తింపుగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి వనమాలి బిరుదును మీకు ఈ మెయిల్, మొబైల్‌కు వారం రోజుల్లో పంపిస్తారని  స్పీకర్ పోచారం తెలిపారు.