ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లాలోని అరకు ఘాట్రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా పడిన విషయం తెలిసిందే. అరకు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అరకు ఘాట్రోడ్డులో టూరిస్టు బస్సు లోయలోకి దూసుకెళ్లింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎనిమిది మంది సంఘటనా స్థలంలో మృతిచెందారు. పోలీసు బృందాలు, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో పలువురు హైదరాబాద్లోని షేక్పేట్ వాసులుగా గుర్తించారు.