అరకు ప్రమాదంపై గవర్నర్‌ తమిళిసై దిగ్భ్రాంతి

ఏపీలోని అరకు ఘాట్‌రోడ్‌లో జరిగిన ప్రైవేటు టూరిస్టు ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన తనను షాక్‌కు గురిచేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు సాధ్యమైనంత ఉత్తమ వైద్యం అందించాలని గవర్నర్‌ కోరారు. 

ఏపీలోని విశాఖ‌ప‌ట్నం జిల్లా అనంత‌గిరి మండ‌లం డముక‌లో ఐదో నెంబ‌రు మ‌లుపు వ‌ద్ద‌ ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. అర‌కు ఘాట్‌రోడ్డులో టూరిస్టు బస్సు లోయ‌లోకి దూసుకెళ్లింది. బ‌స్సులో 30 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు స‌మాచారం. వీరిలో న‌లుగురు సంఘ‌ట‌నా స్థ‌లంలో మృతిచెందారు. పోలీసు బృందాలు, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ప‌లువురు హైదరాబాద్‌వాసులుగా గుర్తింపు.